Monday 28 November 2016

బ‌లితీసుకుంటున్న బ‌యోలు


విరామ‌మెరుగ‌క ప‌రిశ్ర‌మిస్తూ, బ‌లం ధ‌రిత్రికి బ‌లికావించే క‌ర్ష‌కుడికి కుడి, ఎడ‌మ‌ల ద‌గా నిత్య‌కృత్య‌మైంది.  వ‌రుణుడి క‌రుణ‌కోసం ఆకాశం వంక ఆశ‌గా ఎదురుచూసే క‌ష్ట‌జీవిని దోచుకోవ‌డానికి అంద‌రూ ముందుంటున్నారు. విత్త‌నాల మొద‌లు, ఉత్ప‌త్తి విక్ర‌యం వ‌ర‌కు ఒక‌టే తీరు. అధికారంలోకి వ‌చ్చిన అన్ని పార్టీల‌దీ అదే తీరు. ఇటీవ‌లి కాలంలో రైతు వెన్ను విరుస్తున్న మ‌రో స‌మ‌స్య న‌కిలీ బ‌యోలు. 
 ఒక‌టి రెండు కాదు.. జిల్లాకో వెయ్యికి పైగా ఇలాంటి కేంద్రాలు త‌యార‌య్యాయి. వీటి ద్వారా కేవ‌లం ఏపిలో జ‌రిగే వ్యాపారం ఎంతో తెలుసా అక్ష‌రాల మూడువేల కోట్ల రూపాయ‌లు. బయో ఎరువుల ఇప్ప‌డు సాగుతున్న దందా రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా శాసించే స్ధాయిలో ఉంది.  గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, హైదరాబాద్‌.. ఇలా ఒక‌టేమిటి అడుగుకో సంస్థ ఏర్పాటైంది. గుజ‌రాత్, ముంబై త‌దిత‌ర  ప్రాంతాల‌నుంచి భారీగా దిగుమ‌తి చేసుకొని రీ ప్యాకింగ్ చేస్తున్నవారికి కొదువ లేదు. 
మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా రూ.5000 కోట్ల వరకు నకిలీ బయోల వ్యాపారం సాగుతోంది. ఈ ఆరు రాష్ట్రాల్లో బయోల వ్యాపారానికి తెలుగు రాష్ట్రాలే రాజధాని అంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు. దీని వెనుక బ‌డానేత‌ల నుంచి వారి అనుయాయులుగా ఉండే వందిమాగ‌ధులు ఉన్నారు. వారికి రిటైర్డ్ వ్య‌వ‌సాయ శాఖ ఉద్యోగులు ఆస‌రా. వారికి మాత్ర‌మే ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేసే వారితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయిమ‌రి. నకిలీల‌ ఉత్పత్తిలో గుంటూరు, కర్నూలు, హైదరాబాద్‌ కీలకంగా ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో సుమారు వంద పెద్ద యూనిట్‌లు పని చేస్తున్నాయి. ఈ యూనిట్‌ల ద్వారా ఏటా రూ. 300 కోట్ల విలువైన బయోలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోలను రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 500 కంపెనీలు కొనగోలు చేస్తున్నాయి. మూడో దశలో రెండు రాష్ట్రాల్లో 15వేల మంది పంపిణీదారులు రూ. వెయ్యి కోట్ల లావాదేవీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో 60 నుంచి 70 సంస్థలు ఉండగా కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో 30 సంస్థల వరకు పని చేస్తున్నాయి.
బయోల తయారీ కోసం వాడుతున్న ముడి స‌రుకు కూడా అత్యంత దారుణం. ఇండ‌స్ట్రీస్ లో మిగిలిపోయిన‌, వాడిన త‌ర్వాత ఉండే వ్య‌ర్ధాల‌ను ఉపయోగిస్తున్నారు. ఇక అన్నింటికీ ముందుండే చైనా ఉత్ప‌త్తుల‌కు కొర‌త లేదు. మ‌న‌కు ల‌భించే సాల్వెన్స్‌ 90 శాతం, జిబ్బర్లిక్‌ యాసిడ్‌, డిటర్జంట్‌, చైనా నుంచి వచ్చే రసాయనిక పదార్థాలనూ కలిపి బయోల పేరుతో తయారు చేస్తున్నారు. ప్రధానంగా రెండు వందల లీటర్ల డ్రమ్ముల్లో ఈ ద్రవ పదార్థాలను పోసి పల్వరైజ్‌  ప్యాకింగ్‌ చేస్తున్నారు. దీన్నే రీప్యాకింగ్ చేసి అంద‌మైన లేబుల్స్ తో మార్కెట్ చేస్తున్నారు. వీటికి మార్కెట్ టెక్నిక్ మ‌రింత‌గా తోడ్ప‌డుతుంది. డీల‌ర్లు విక్ర‌యించే సామ‌ర్ధ్యాన్ని బట్టి వారి కుటుంబం మొత్తానికి విదేశీ టూర్లు ఏర్పాటు చేస్తున్నారు ఉత్ప‌త్తిదారులు. మార్జిన్ విష‌యంలోనూ 60శాతం పైగా ఉంటోంది. వీటికి ఆశ‌ప‌డిన విక్రేత‌లు బ‌ల‌వంతంగా అయినా రైతుకు ప్రొడ‌క్టు అంట‌గ‌డుతున్నారు. ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ సీజ‌న్ లో క్రెడిట్ మీదే సాగే వ్యాపారం కావ‌డంతో రైతు కూడా త‌ప్ప‌నిస‌రిగా తీసుకు వెళుతున్నాడు.
చైనా నుంచి వ‌చ్చే రసాయనాల‌ను పొడి రూపంలో తెస్తారు. ఎంత ఎక్కువ‌గా అనుకున్నా కిలో ధ‌ర రూ 5వేలు లోపు మాత్ర‌మే. ఈ పొడిని కాన్స‌న్ ట్రేట్ గా వాడి లిక్విడ్ గా మార్చుతున్నారు. అంటే ఒక కేజీ ద్వారా 20లీట‌ర‌ల్ నుంచి 25 లీట‌ర్ల వ‌ర‌కు త‌యారు చేస్తున్నారు. ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌, అబామెక్టిన్‌, ఎసిటమాప్రిడ్ వంటి ర‌సాయ‌నాలు క‌లుపుతారు. ఇలా త‌యారైన 25 లీట‌ర్ల‌ను 50 ఎంఎల్‌ - 100 ఎంఎల్ బాటిళ్ల రూపంలో మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నారు. ధ‌ర కూడా 50మి.లీ  రూ 500 ఉంటుంది. ఇది ఎంఆర్పి. వీటిని మొక్క పెరుగుదలకు ఉపయోగం అంటూ ప్ర‌చారం కూడా ఊద‌ర‌గొట్టేస్తున్నారు. అమైనో యాసిడ్‌, హ్యూమిక్‌ యాసిడ్‌, నైట్రో బెజిన్‌, సివిడి ఎక్స్‌ట్రాక్‌ వంటి మందులను ఉపయోగిస్తే మొక్క వెంటనే పెరుగుతుంది. బయో ఎరువులు ఉపయోగించిన వెంటనే మొక్కలో ఎదుగుదల కనిపిస్తుంది. దీంతో రైతులు ఇవి బాగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.
 బ‌యో అంటేనే రసాయనిక అవశేషాలు లేకుండా అని అర్ధం. ఇక్క‌డ అదే లోపిస్తోంది. బయో వ్యాపారులు వెనుక ఉంటున్న శ‌క్తి రాజ‌కీయం. మంత్రుల బంధువులు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారంటే ఎంత‌గా ఈ న‌కిలీలు ప్ర‌భావితం చేస్తున్నాయో తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా చైనా నుంచి రసాయనిక పదార్థాలు తెచ్చి బయోలను ఏటా రూ. 400 కోట్లు అమ్ముతున్నారు. బయో ఎరువుల తయారీ కోసం ల్యాబ్‌లు ఉండాలి. ఈ ల్యాబ్‌ల్లో మైక్రో బయాలజీ చదివిన శాస్త్రవేత్తలు ఉండాలి. అయితే ఇవేవీ తెలుగు లేకుండానే ఉత్ప‌త్తులు మార్కెట్ లో ఉన్నాయి. 

No comments:

Post a Comment